2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడుంటే టీమిండియా ఆ టోర్నీలో విజేతగా నిలిచేది కాదనీ వ్యాఖ్యానించాడు. ఫిట్ గా లేనంటూ టీమ్ మేనేజ్ మెంట్ తనను పక్కన పెట్టి పెద్ద తప్పు చేసిందంటూ అక్తర్ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. 2011 వరల్డ్ కప్ సెమీస్లో తాను ఆడి ఉండాల్సిందనీ , అయితే టీమ్మేనేజ్మెంట్ తనను మ్యాచ్కు ఫిట్గా లేనని పక్కనబెట్టిందన్నాడు. భారత్ ను ఓడించి పాక్ ను వాంఖెడేకు తీసుకెళ్లాలని భావించాననీ గుర్తు చేసుకున్నాడు. స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్పై తీవ్ర ఒత్తిడి ఉంటుందనీ, అసలు పాక్ ను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదన్నాడు. దాంతో తమపై ఒత్తిడి లేదన్నాడు. మ్యాచ్లో తొలి 10 ఓవర్లే కీలకమని తనకు తెలుసని, తాను ఉండి ఉంటే కీలకమైన సచిన్, సెహ్వాగ్లను ఔట్ చేసేవాడినని అన్నాడు. వాళ్లిద్దరూ తొందరగా ఔటైతే ఇండియా కుప్పకూలేదన్నాడు. దీనిపై తాను చాలా చాలా బాధపడ్డాననీ, డగౌట్లో కూర్చొని ఐదారు గంటల పాటు మ్యాచ్ చూడటం, చివరికి పాకిస్థాన్ ఓడిపోవడం బాధగా అనిపించిందన్నాడు. అదే బాధలో డ్రెస్సింగ్లో కొన్ని వస్తువులు పగలగొట్టాననీ చెప్పాడు.
అయితే అక్తర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అంతకముందు 2003 వన్డే వరల్డ్కప్లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు జట్టులోనే ఉన్నావుగా..అప్పుడు ఏం చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నీ బౌలింగ్ను సచిన్ ఉతికి ఆరేసిన విషయం గుర్తు లేదా .. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు అని కామెంట్స్ చేశారు. నిజానికి ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్కప్ల్లో పాకిస్తాన్ టీమిండియాను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. ఇది ఆ జట్టుకు , వారి ఫాన్స్ కూ మింగుడు పడని విషయం. 2011 సెమీఫైనల్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్, సెహ్వాగ్ , రైనా రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత బౌలర్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందించారు. దీంతో ఫైనల్ చేరిన టీమిండియా ఆ తర్వాత శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా అవతరించింది.