బాలీవుడ్ నటి అతియా శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (Athiya Shetty- KL Rahul) ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ జనవరి 23న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్హౌస్లో పెళ్లి చేసుకున్నారు. వీరి చిత్రాలు ఇప్పటికీ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అతియా శెట్టి, రాహుల్ తమ ఇన్స్టాగ్రామ్లో వివాహ ఫోటోలను కూడా పంచుకున్నారు. వాటిపై అభిమానులు కూడా తమ ప్రేమను కామెంట్స్ రూపంలో చూపించారు. అయితే వీరి పెళ్ళికి విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఆటగాళ్ళు ఖరీదైన బహుమతులు ఇచ్చారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఖరీదైన బహుమతుల విషయంపై వారి కుటుంబ సభ్యులు నోరు విప్పారు.
Also Read: 100 Cheetahs From South Africa: దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వందకుపైగా చిరుతలు..!
మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ.. అతియా శెట్టి- కెఎల్ రాహుల్లకు రూ. 2.17 కోట్ల విలువైన బిఎమ్డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడని, ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసాకి నింజా బైకును కానుకగా ఇచ్చాడని కథనాలు వచ్చాయి. అదే సమయంలో సల్మాన్ ఖాన్ కూడా ఈ జంటకు లగ్జరీ కారును కూడా బహుమతిగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు ఈ విషయాలన్నీ ఫేక్ అని చెప్పారు. ఇటీవల ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. కోహ్లీ, ధోనీ ఖరీదైన గిఫ్టులు ఇచ్చారన్న కథనాల్లో నిజంలేదని, అవి నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ఈ వివాహంపై ప్రజలకు వార్తలు అందించే ముందు మీడియా తమతో నిర్ధారణ చేసుకోవాలని ఆయన చెప్పారు.