ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ మరో 3 రోజుల్లో మొదలు కానుంది. వాంఖడే వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్ల మధ్య మార్చి 26 న జరగనున్న తొలి మ్యాచుతో ఐపీఎల్-2022 టోర్నీకి తెరలేవనుంది. దీంతో ఈ మెగా టోర్నీలో పాల్గొననున్న అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్స్లో బీజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు,దక్షిణాఫ్రికా అండర్-19 ప్లేయర్ డివాల్డ్ బ్రీవిస్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్ సెషన్లో భారీ షాట్లు ఆడుతూ ఈ జూనియర్ ఏబీ డివిలియర్స్ అలరించాడు.
అయితే ఈ ప్రాక్టీస్లో భాగంగా బంతిని చూడకుండానే డివాల్డ్ బ్రీవిస్ భారీ సిక్సులు బాది అందరనీ షాక్ కు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇదిలాఉంటే.. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్కప్లో ఏకంగా 506 పరుగులు చేసిన డివాల్డ్ బ్రీవీస్.. ఈ టోర్నీ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ వరల్డ్కప్లో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఈ దక్షిణాఫ్రికా యువ హిట్టర్ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. అతని కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరికి ముంబయి ఇండియన్స్ రూ.3 కోట్లకి డివాల్డ్ బ్రీవిస్ని కొనుగోలు చేసింది.