సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

భారత్ – దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలిచినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. 2025లో ఒక్క అర్ధశతకం కూడా చేయని సూర్య, తన ఫామ్ కోల్పోవడంపై నిజాయితీగా స్పందించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టినా, అంతర్జాతీయాల్లో అదే జోరు చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనైనా ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో సూర్య ఫామ్ కీలకంగా మారింది. సౌతాఫ్రికాపై సిరీస్ గెలిచిన టీమిండియా […]

Published By: HashtagU Telugu Desk
Suryakumar Yadav

Suryakumar Yadav

భారత్ – దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్‌ను టీమిండియా గెలిచినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. 2025లో ఒక్క అర్ధశతకం కూడా చేయని సూర్య, తన ఫామ్ కోల్పోవడంపై నిజాయితీగా స్పందించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టినా, అంతర్జాతీయాల్లో అదే జోరు చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లోనైనా ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో సూర్య ఫామ్ కీలకంగా మారింది.

  • సౌతాఫ్రికాపై సిరీస్ గెలిచిన టీమిండియా
  • కానీ టీమిండియాకి ఒక్కటే లోటన్న కెప్టెన్
  • అది తన ఫామే అంటూ సూర్య స్వవిమర్శ

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3 – 1తో గెలుచుకున్నప్పటికీ, 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్ ఫామ్‌పై సూర్య స్వయంగా విమర్శలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

2025 క్యాలెండర్ ఏడాదిలో సూర్యకుమార్ యాదవ్ ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన సూర్య, ఈ ఏడాది సగటు 14 కంటే తక్కువగా నమోదు చేయడం అతని కెరీర్‌లోనే కష్టకాలంగా నిలిచింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్, తన ఫామ్‌పై నిజాయితీగా స్పందించాడు. “బహుశా ఈ సిరీస్‌లో మనం పూర్తిగా సాధించలేకపోయిన ఒక్క విషయం బ్యాటర్ సూర్యను కనిపెట్టలేకపోవడమే! ఎక్కడో మిస్ అయ్యాడు. కానీ తప్పకుండా బలంగా తిరిగి వస్తాడు. జట్టుగా మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను, అని సూర్య వ్యాఖ్యానించాడు. “మనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరు ముందుకొచ్చి జట్టును గట్టెక్కించారు. కెప్టెన్‌గా ఇది నాకు చాలా తృప్తినిచ్చింది, అని అతను చెప్పాడు.

2025లో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోర్ 47 నాటౌట్ మాత్రమే. ఈ స్కోర్ పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో నమోదైంది. అంతేకాదు, అతని స్ట్రయిక్‌ రేట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోయి 117.87గా నిలిచింది. ఈ ఏడాది సూర్య ఆడిన 20 మ్యాచ్‌ల్లో కేవలం 218 పరుగులే సాధించాడు. .

అయితే, ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్య కుమార్ యాదవ్ అద్భుత ఫామ్ చూపించాడు. ఆ సీజన్‌లో 717 పరుగులు సాధించినప్పటికీ, అదే జోరును టీ 20 అంతర్జాతీయాల్లో కొనసాగించలేకపోయాడు. వరల్డ్ కప్‌కు ముందు చివరి అసైన్‌మెంట్‌గా ఉన్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అయినా సూర్య కుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

 

  Last Updated: 20 Dec 2025, 12:13 PM IST