CSK: ఐపీఎల్ 2026 ఏడో మ్యాచ్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని CSK జట్టుకు ఈ సీజన్లో ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దీనికి సమాధానంగా పంజాబ్ జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ ఓటమి ఉన్నప్పటికీ CSK ఐపీఎల్లో ఒక భారీ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును వెనక్కి నెట్టింది.
ఐపీఎల్లో 36వ సారి ఈ ఘనత సాధించిన CSK
నిజానికి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు నిలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఐపీఎల్లో చెన్నై జట్టు 200 ప్లస్ స్కోరు సాధించడం ఇది 36వ సారి. దీనితో RCBని వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు 35 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేయగలిగింది. ఈ జాబితాలో 33 సార్లు ఈ ఘనత సాధించిన పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది.
Also Read: Shreyas Iyer: ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్పై నిషేధం పడనుందా?
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన జట్లు
- చెన్నై సూపర్ కింగ్స్- 36 సార్లు
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 35 సార్లు
- పంజాబ్ కింగ్స్- 33 సార్లు
- ముంబై ఇండియన్స్- 32 సార్లు
- కోల్కతా నైట్ రైడర్స్- 30 సార్లు
మ్యాచ్ సాగిందిలా..
మ్యాచ్ విషయానికి వస్తే.. చేపాక్ మైదానంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్కు వచ్చిన సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హత్రే ఇన్నింగ్స్ను నిలబెట్టి రెండో వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అదే సమయంలో ఆయుష్ 43 బంతుల్లో 73 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
వీరు కాకుండా శివమ్ దూబే అజేయంగా 45 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులు జోడించారు. వీరి ఇన్నింగ్స్ల పుణ్యమా అని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి, 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. పంజాబ్ తరపున కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గరిష్టంగా 50 పరుగులు చేయగా, ప్రభసిమ్రాన్ సింగ్ 43 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 39 పరుగులు చేశారు. అలాగే కూపర్ కానోలీ 36 పరుగుల సహకారాన్ని అందించాడు. CSKను ఓడించి పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
