IPL: నిమిషాల్లోనే టిక్కెట్లు ఖతమ్(CSK vs LSG)

ఐపీఎల్ ఫీవర్ ఊపందుకుంది. ఈ సారి అన్ని జట్ల హోం స్టేడియాల్లో మ్యాచ్ లు ఉండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 04:18 PM IST

IPL: ఐపీఎల్ ఫీవర్ ఊపందుకుంది. ఈ సారి అన్ని జట్ల హోం స్టేడియాల్లో మ్యాచ్ లు ఉండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా ఐపీఎల్ మ్యాచ్ లను ఫ్యాన్స్ ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. దీంతో ఈ సారి తమ హోం టౌన్స్ కు తిరిగి రావడంతో టిక్కెట్ల కోసం ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఏప్రిల్ 3న జరిగే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ సేల్ అయిపోయాయి. ఐపీఎల్ మ్యాచ్ లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దాదాపు మూడేళ్ళ తర్వాత సొంతగడ్డపై మ్యాచ్ ఆడబోతోంది. దీంతో తమ అభిమాన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆట చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు.

ఆన్ లైన్ , ఆఫ్ లైన్ పద్ధతిలో టిక్కెట్లు అమ్మకానికి పెట్టగా మొత్తం అన్నీ అమ్ముడైపోయాయి. ఉదయం నుంచే టిక్కెట్ల కోసం చెపాక్ స్టేడియం దగ్గర కిలోమీటర్ల మేర అభిమానులు బారులు తీరారు. చెన్నై సూపర్ కింగ్స్ మూడేళ్ళ తర్వాత చెపాక్ లో మ్యాచ్ ఆడుతుండడమే ఈ క్రేజ్ కు కారణం. అలాగే కెప్టెన్ ధోనీకి ఆటగాడిగా ఇదే చివరి సీజన్ అన్న వార్తలు కూడా అభిమానుల్లో క్రేజ్ ను పెంచేశాయి. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పలువురు కీలక ఆటగాళ్లు దూరమవడంతో పాటు కెప్టెన్సీ మార్పు ప్రభావం చూపింది. దీంతో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ సారి మినీ వేలం తర్వాత మళ్ళీ బలం పుంజుకున్న చెన్నైని ధోనీ ఛాంపియన్ గా నిలుపుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.