RCB : ఐపీఎల్ 2026కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. యంగ్ బౌలర్ యశ్ దయాల్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోగా.. తాజాగా 18 ఏళ్ల బౌలర్ సాత్విక్ దేశ్వాల్పై ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. పుదుచ్చేరి జట్టు తరఫున ఆడేందుకు సాత్విక్ దేశ్వాల్ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడని బీసీసీఐకి ఫిర్యాదు వెళ్లింది. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే.. సాత్విక్పై నిషేధం పడే అవకాశం ఉంది. దీంతో అతడు ఆర్సీబీకి ఆడకపోవచ్చు.
- ఆర్సీబీకి మరో షాక్
- యంగ్ స్పిన్నర్పై బీసీసీఐకి ఫిర్యాదు
- అదే జరిగితే జట్టులో ఆడలేడు
ఐపీఎల్ 2026 ముంగిట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో చిక్కుల్లో పడ్డాడు యంగ్ బౌలర్ యశ్ దయాల్. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి జైపూర్ పోక్సో కోర్టు తిరస్కరించింది. మైనర్పై అత్యాచారం ఆరోపణలున్న ఈ కేసు తీవ్రమైనదని.. అరెస్టు నుంచి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తాజాగా ఆర్సీబీకి చెందిన 18 ఏళ్ల బౌలర్ సాత్విక్ దేశ్వాల్ చిక్కుల్లో పడ్డాడు. క్రికెట్లో అవకాశాల కోసం డాక్యుమెంట్లపై ఫోర్జరీ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బీసీసీఐకి ఫిర్యాదు వెళ్లింది.
పుదుచ్చేరి జట్టు తరఫున ఆడుతున్న స్పిన్నర్ సాత్విక్ దేశ్వాల్ను ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.30 లక్షల ప్రారంభ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఇతడు పుదుచ్చేరి జట్టు తరఫున ఆడేందుకు.. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU)కు.. పుదుచ్చేరి నేటివ్ క్రికెట్ ప్లేయర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. పుదుచ్చేరి జట్టుకు ఆడాలంటే కనీసం సంవత్సర కాలం పాటు అక్కడే నివసించి ఉండాలి. కానీ సాత్విక్ ఆ నిబంధనను ఉల్లంఘించాడనేది ప్రధాన ఆరోపణ.
సాత్విక్ దేశ్వాల్ 2025 ఆగస్టు 10 వరకు హర్యానా క్రికెట్ అసోసియేషన్ లీగ్లో ఆడాడని.. అలాంటప్పుడు ఆయన పుదుచ్చేరి నివాసిగా ఎలా గుర్తింపు పొందుతారని నేటివ్ క్రికెట్ ప్లేయర్ అసోసియేషన్ ప్రశ్నించింది. ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని.. నెల గడిచినా బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. దీనిపై అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బీసీసీఐ స్పందించకపోతే మీడియా ముందుకు వెళ్తామని తెగేసి చెప్పింది.
మరోవైపు, నేటివ్ క్రికెట్ ప్లేయర్ అసోషియేషన్ చేసిన ఆరోపణలను.. క్రికెట్ అసోసియేషన్ పుదుచ్చేరి (సీఏపీ) మాజీ అధ్యక్షుడు పీ దామోదరన్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అసత్యమని కొట్టిపారేశారు. సాత్విక్పై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని.. కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై రూ.50 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని.. దీనికి సంబంధించి తమ అడ్వొకేట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా, సాత్విక్పై ఆరోపణలు రుజువైతే.. అతడిపై నిషేధం పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఐపీఎల్ 2026లో సాత్విక్ ఆర్సీబీ తరఫున ఆడలేడు. మరి ఈ విషయంలో బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
