Mallika Sagar : ‘ఐపీఎల్ – 2024’ మినీ వేలం అంటే వందల కోట్ల వ్యవహారం. ఈ మెగా రిచ్ వేలం పాట దుబాయ్ వేదికగా మంగళవారం(డిసెంబర్ 19) జరగబోతోంది. ఈ సారి వేలాన్ని మహిళా ఆక్షనీర్ మల్లికా సాగర్ అడ్వాణీ నిర్వహించనున్నారు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లకు ఆక్షనర్గా వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్థానాన్ని మల్లిక భర్తీ చేయనున్నారు. దీంతో ఐపీఎల్లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్గా మల్లిక నిలువనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎవరు ? నేపథ్యం ఏమిటి ? అనే దానిపై గూగుల్లో నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.
మల్లికా సాగర్.. అపార అనుభవం
మల్లికా సాగర్ వయసు 48 ఏళ్లు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఆర్ట్ కలెక్టర్. ‘మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్’ అనే పేరు కలిగిన ముంబై సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్గా ఆమె వ్యవహరిస్తున్నారు.
ఆమె గత 20 ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు.
2001లో క్రిస్టీస్ ఆక్షన్ హౌస్లో వేలం నిర్వాహకురాలిగా మల్లిక తన కెరీర్ను మొదలుపెట్టారు. క్రిస్టీస్లో వేలం నిర్వహించిన భారత సంతతికి చెందిన తొలి మహిళా ఆక్షనీర్గా మల్లిక నిలిచారు.
2021లో ప్రో కబడ్డీ లీగ్, ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొలి, రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికనే(Mallika Sagar) నిర్వహించారు.
దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ మినీ వేలంలో 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఉన్న ఖాళీలు 77 మాత్రమే. 333 మంది ఆటగాళ్లలో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి.