Ahmedabad Match Pitch Report : అహ్మదాబాద్ వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ సమరానికి పిచ్ రిపోర్ట్ సిద్ధమైంది. ప్రపంచకప్ ఫైనల్ కోసం నరేంద్ర మోదీ స్టేడియంలో ఈసారి ‘మిక్స్డ్ సాయిల్’ (మిశ్రమ మట్టి) పిచ్ను సిద్ధం చేశారు. ఇందులో 70 శాతం ఎర్రమట్టి, 30 శాతం నల్లమట్టిని ఉపయోగించారు. ఎర్రమట్టి వల్ల బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది, ఇది పేస్ బౌలర్లకు ఆరంభంలో అనుకూలిస్తుంది. అదే సమయంలో నల్లమట్టి ఉండటం వల్ల పిచ్ త్వరగా విరిగిపోకుండా బ్యాటింగ్కు సహకరిస్తుంది. అంటే, టెక్నిక్ ఉన్న బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే ఇక్కడ భారీ స్కోర్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 9న ఇదే పిచ్పై జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడా మ్యాచ్లో దక్షిణాఫ్రికా 213 పరుగుల భారీ స్కోరు సాధించిందంటే, ఈ పిచ్ స్వభావం ఎంతలా బ్యాటింగ్కు అనుకూలమో అర్థం చేసుకోవచ్చు.
టాస్ గెలిస్తే బౌలింగ్ వైపే మొగ్గు.. డ్యూ ఫ్యాక్టర్ కీలకం!
ఈ మ్యాచ్లో ‘టాస్’ అత్యంత కీలకం కానుంది. అహ్మదాబాద్లో రాత్రి సమయంలో మంచు (Dew) కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంచు పడితే రెండో ఇన్నింగ్స్లో బంతి తడిసి బౌలర్లకు గ్రిప్ దొరకడం కష్టమవుతుంది. ఇది ఛేజింగ్ చేసే జట్టుకు కొండంత అడ్వాంటేజ్గా మారుతుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది. గత రికార్డులను పరిశీలిస్తే, ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతున్నా, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలర్లు కట్టుదిట్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.
భారీ స్కోరు ఖాయం.. అభిమానులకు పరుగుల విందు!
గతంలో సౌత్ ఆఫ్రికా ఈ పిచ్పై 200 పైచిలుకు పరుగులు చేసి 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తే, ఫైనల్లో భారత్ లేదా న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసినా కనీసం 180 నుండి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. బుమ్రా, సిరాజ్ వంటి భారత పేసర్లకు ఈ పిచ్ ఇచ్చే బౌన్స్ కలిసి వచ్చే అంశం కాగా, అటు కివీస్ పేసర్లు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు. మొత్తానికి, బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్పై పరుగుల వర్షం కురిసి, అభిమానులకు ఒక హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం లభించనుంది.
