సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

భారత్- పాకిస్థాన్ రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. కానీ ఇవి వేర్వేరు ప్రత్యర్థులతో తలపడతాయి.

Published By: HashtagU Telugu Desk
Asia Cup Rising

Asia Cup Rising

Asia Cup Rising: రాధా యాదవ్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు గ్రూప్-ఏ టేబుల్ టాపర్‌గా నిలిచి, మంగళవారం (ఫిబ్రవరి 17) ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో నేపాల్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. అయితే అధికారికంగా క్వాలిఫై కావడానికి పాకిస్థాన్-ఏ, యూఏఈ (UAE) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం కోసం నిరీక్షించాల్సి వచ్చింది.

పాకిస్థాన్-ఏ ఘనవిజయం

గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో యూఏఈ జట్టు పాకిస్థాన్-ఏ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈషా ఓజా నాయకత్వంలోని యూఏఈ జట్టు కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్-ఏ జట్టు ఇంకా 9 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పాకిస్థాన్ నెట్ రన్-రేట్ (NRR) 0.457కు మెరుగుపడటంతో, యూఏఈని వెనక్కి నెట్టి రెండో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Also Read: తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

సెమీస్‌లో భారత్, పాక్ జట్లు

ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు 3.042 నెట్ రన్-రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత పాకిస్థాన్-ఏ, నేపాల్‌పై వరుస విజయాలతో భారత్ అద్భుతంగా పుంజుకుంది. బుధవారం జరగనున్న గ్రూప్-బి చివరి మ్యాచ్‌ల తర్వాత సెమీఫైనల్‌లో ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ ఎవరితో తలపడతాయో స్పష్టత రానుంది.

ఫైనల్‌లో భారత్-పాక్ సమరం సాధ్యమేనా?

భారత్- పాకిస్థాన్ రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. కానీ ఇవి వేర్వేరు ప్రత్యర్థులతో తలపడతాయి. ఒకవేళ సెమీఫైనల్ పోరులో ‘వుమెన్ ఇన్ బ్లూ’, ‘గ్రీన్ ఆర్మీ’ తమ తమ మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఫైనల్‌లో దాయాదుల మధ్య టైటిల్ పోరును చూసే అవకాశం ఉంటుంది. క్రికెట్ అభిమానులు కూడా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  Last Updated: 17 Feb 2026, 10:52 PM IST