తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక యువతి ఇంటిపై ఏకంగా 100 మంది యువకులు దాడి చేసి ఆమె తల్లిదండ్రులను చితకబాధి ఇంటిని ధ్వంసం చేసి ఆ యువతని ఎత్తుకెళ్లారు. అసలేం జరిగిందంటే.. రాగన్నగూడకు చెందిన ఓ యువతి ఇటీవలే బీడీఎస్ ను పూర్తి చేసింది. దీంతో ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే నవీన్ కుమార్ రెడ్డి అనే యువకుడు గత ఐదారు నెలల క్రితం ఆమెను పెళ్లి చూపులు చూసేందుకు వచ్చాడు. కానీ ఆ యువతి తల్లిదండ్రులకు నవీన్ కుమార్ రెడ్డి నచ్చలేదు.
అదే విషయాన్ని మధ్యవర్తి ద్వారా నవీన్ కి తెలియజేశారు. కానీ నవీన్ మాత్రం పెళ్లి చూపుల్లోనే ఆ యువతీ పై మనసు పారేసుకున్నాడు. దాంతో ఎలా అయినా ఆ యువతీని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తనని పెళ్లి చేసుకోవాలి అంటూ ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. తనకేం తక్కువ అంటూ ఆమెను మరింత వేధింపులకు గురి చేశాడు. నవీన్ వేధింపులకు విసిగిపోయిన ఆమె పెళ్లి ప్రస్తావని తీసుకురావద్దు కానీ ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఇక తాజాగా ఆమెను చూసుకునేందుకు పెళ్లి వారు వస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి ఎలా అయినా సంబంధాన్ని చెడగొట్టాలి అన్న కోపంతో ఏకంగా 100 మంది యువకులను నవీన్ రెడ్డి వెంట వేసుకొని వచ్చాడు.
యువతీ ఇంట్లోకి ప్రవేశించి వారి వస్తువులను ధ్వంసం చేశారు. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డువచ్చిన ఆమె తల్లిదండ్రులను ఇరుగుపొరుగు వారిపై కూడా దాడి చేశారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.