CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాంగ మంత్రి జైశంకర్ను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారత్ సమ్మిట్కు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని.. ఆ విషయంపైనే విదేశాంగ మంత్రి జైశంకర్ను కలుస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయని.. నెలరోజుల పాటు దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయన్నారు. దీనికోసం రెండు రోజుల్లో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు హాజరయ్యే అవకాశముందని చెప్పారు.
Read Also: TDCO Houses : టిడ్కో ఇళ్ల పై మంత్రి నారాయణ క్లారిటీ
రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఆయా అంశాలు సాధించుకురావాలనే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని.. అసెంబ్లీలో చర్చకు హాజరుకావాలన్నారు. డీలిమిటేషన్.. లిమిటేషన్ ఫర్ సౌత్ అని సీఎం వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధముందని.. ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్రెడ్డి అన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి ట్రాప్లోనూ తాను పడనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.