G20 – INDIA Leaders : జీ20 సదస్సు ఈనెల 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో భాగంగా సెప్టెంబరు 9న (శనివారం) జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవ్వనున్న అధికారిక విందులో పాల్గొననున్న ముఖ్య అతిథులు, రాజకీయ ప్రముఖులు, రాష్ట్రాల సీఎంల లిస్టుపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది. దానికి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి నుంచి హాజరయ్యేది ఎవరు ? గైర్హాజరయ్యేది ఎవరు ? అనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ విందుకు రావాలంటూ.. ఇండియా కూటమికి చెందిన ముగ్గురు కీలక నేతలకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఇన్విటేషన్ అందిందని సమాచారం. ఆహ్వానం అందుకున్న ‘ఇండియా’ కీలక లీడర్లలో డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ కూడా విందుకు హాజరవుతారని అంటున్నారు. ఆహ్వానం అందుకున్న ఈ నాయకులంతా రాష్ట్రపతి ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారని తెలిసింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులను కూడా ఈ విందుకు రాష్ట్రపతి ఆహ్వానించారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడ కూడా ఆహ్వానం అందుకున్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణాలను చూపుతూ హెచ్డీ దేవెగౌడ ఈ విందుకు హాజరుకాలేనని తెలిపారు. కాగా, 2022లో బీహార్ లోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన తర్వాత తొలిసారిగా.. జీ20 విందు కార్యక్రమం వేదికగా ప్రధాని మోడీని బీహార్ సీఎం నితీశ్ కుమార్ (G20 – INDIA Leaders) కలవనున్నారు.