Raksha Bandhan – Holy Stories : రక్షా బంధన పర్వదినంతో ముడిపడిన ఎన్నో ఘట్టాల గురించి మన పురాణాల్లో సవివర ప్రస్తావన ఉంది. వాటి గురించి తెలుసుకుంటే.. రాఖీ యొక్క శక్తి మనకు అర్ధమవుతుంది. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం..
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం (దాదాపు 12 సంవత్సరాలు) పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు.. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లి అమరావతిలో తలదాచుకుంటాడు. తన భర్త ఇంద్రుడి నిస్సహాయతను చూసిన ఇంద్రాణి.. యుద్ధంలో పాల్గొనేలా ఆయనకు ధైర్యం చెబుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా వారు పూజించిన రక్షలను ఇంద్రుడికి పంపుతారు. ఆ రక్షలను ధరించి యుద్ధానికి వెళ్లిన ఇంద్రుడు గెలుపొంది.. త్రిలోక ఆధిపత్యాన్ని మళ్లీ సొంతం చేసుకుంటాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధన సంప్రదాయాన్నే..రాఖీ పండుగగా ఆచరిస్తున్నామని పురాణాలు చెబుతున్నాయి.
ఇక మహాభారతంలోనూ రాఖీ ప్రస్తావనతో ఒక ఘట్టం ఉంది. శిశుపాలుడిపైకి సుదర్శన చక్రాన్ని వదిలే టైంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమవుతుంది. దాన్ని చూసిన వెంటనే ద్రౌపది తన పట్టుచీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలికి రక్షగా చుడుతుంది. శ్రీకృష్ణుడిని తన అన్నగా భావించి స్పందించినందుకు.. అండగా ఉంటానని మాట ఇస్తాడు. ఈ సంఘటనే రాఖీ పండుగకు నాంది పలికిందని అంటారు. ఆ మాట ప్రకారమే.. కురుసభలో అవమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికి శ్రీ కృష్ణుడు అండగా నిలిచాడు.
ప్రహ్లాదుడి మనవడు, రాక్షస రాజు బలి చక్రవర్తి ఆగడాలతో జనం, దేవతలు బాగా ఇబ్బందిపడ్డారు. ఆ టైంలో అందరినీ రక్షించడానికి శ్రీమహావిష్ణువు వామనుడి రూపంలో భూమిపైకి వచ్చారు. ఆ టైంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తి చేతికి రక్షాబంధన దారాన్ని కట్టి తానెవరో చెబుతుంది. తన భర్తని తిరిగి వైకుంఠానికి పంపాలని బ్రాహ్మణ యువతి రూపంలో ఉన్న మహాలక్ష్మి కోరుతుంది.
వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో శ్రావణ పౌర్ణమి రోజున ‘రక్ష’ కట్టించుకోవడం చూసిన ఆయన కుమారులు..తమకు కూడా సోదరి కావాలని పట్టుబట్టారట. ఆ టైంలోనే వినాయకుడి కళ్ల నుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని దంపతులు సంతోషి మాతని శుక్రవారం రోజు పూజిస్తే కోరికలు నెరవేరతాయని నమ్ముతారు. శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ కట్టిన, కట్టించుకున్నవారిపై సంతోషిమాత దీవెనలు ప్రసరిస్తాయని చెబుతారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.