Former minister Talasani Srinivas Yadav : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లోని ప్రతిపాదిత ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో కంపెనీని ఏర్పాటు కోసం నిర్ణయించినా అక్కడ కంపెనీ ఏర్పాటు రద్దు కావడంతో ఆ గ్రూప్ నుంచి తమ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమన్నారు. ఆ కంపెనీ యాజమాన్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, ఎనిదేళ్ల కిందట తన కుమారుడు తప్పుకున్నారని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
బాధ్యత గల ప్రభుత్వం రైతుల ఆందోళనను పరిష్కరించే ప్రయత్నం చేయాలి కానీ.. బీఆర్ఎస్ను, వ్యక్తులను బదనాం చేయాలని ప్రయత్నం తగదని తలసాని ఆక్షేపించారు. ఆ కంపెనీతో తమకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని తలసాని వ్యాఖ్యానించారు. భవిష్యత్లో తమపై ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే బీఆర్ఎస్ ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటని మండిపడ్డారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో తన కుమారుడు రాజమండ్రి ప్రాంతంలో కంపెనీ పెట్టాలని అనుకున్నది నిజమేనని.. మూడు నెలలకే ఆ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాడని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతకాకనే కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. లగచర్లలోనూ ఇదే తరహాలో కేటీఆర్పై బురద జల్లే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: INS Arighat : విశాఖ తీరంలో ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ నుంచి తొలి మిస్సైల్ టెస్ట్