కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై అర్ధరాత్రి జరిగిన మిస్టరీ వీడింది. వీహెచ్ పై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై పోలీసులు విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. వీహెచ్ ఇంటిపై జరిగిన దాడిని అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు ఆ సంఘటనకు సంబందించిన విషయాలను వెల్లడించారు. వీహెచ్ ఇంటిపై యూపీకి చెందిన పద్దెనిమిదేళ్ల సిద్ధార్థ సింగ్ దాడి చేసినట్లు నిర్ధారించారు. సిద్దార్థ ప్రస్తుతం విద్యానగర్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. అతను వీహెచ్ ఇంటి సమీపంలో మరో ముగ్గురితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇంటి డాబాపై క్రికెట్ ఆడుతూ ఆ యువకులు అల్లరి చేయగా, ఇక్కడ క్రికెట్ ఆడొద్దంటూ వీహెచ్ మందలించారు. దీన్ని మనసులో పెట్టుకున్న సిద్ధార్థ బుధవారం రాత్రి ఇంటి బయట పార్కు చేసిన వీహెచ్ కారు అద్దాలు పగలగొట్టాడని పోలీసులు పేర్కొన్నారు.