No To Early Elections : ఈ ఏడాది డిసెంబరులో లేదా 2024 జనవరిలో జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కేంద్రం స్పందించింది. దేశంలోని దాదాపు 13 రాష్ట్రాలకు, లోక్ సభకు ఒకేసారి జమిలి ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారానికి తెర దించింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వివరాలను వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల సమయాన్ని ముందుకు కానీ, వెనుకకు కానీ జరపాలనే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీ కాలంలోని చివరి రోజు వరకు కేంద్ర సర్కారు కొనసాగుతుందని (No To Early Elections) తేల్చి చెప్పారు.
‘ముందస్తు ఎన్నికలు’ అనేది కేవలం మీడియా క్రియేట్ చేసిన పుకారు మాత్రమేనని కేంద్రమంత్రి చెప్పారు. అయితే ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై కేంద్రం నియమించిన హైలెవల్ కమిటీ ఆ అంశంపై అధ్యయనాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను, న్యాయ నిపుణులు, పాలనారంగ నిపుణుల ఒపీనియన్స్ ను ఆ కమిటీ సేకరిస్తుందన్నారు. ప్రతిపక్షాలకు కూడా ఈ కమిటీలో ఛాన్స్ ఇవ్వాలని భావించినందు వల్లే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని హైలెవల్ కమిటీలో సభ్యులుగా చేర్చారని తెలిపారు. కమిటీలో ఆయన భాగం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని పేర్కొన్నారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంటు సమావేశం ఎజెండాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తగిన సమయంలో వెల్లడిస్తారని ఠాకూర్ చెప్పారు.