Kakinada: కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో మత్స్యకారులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వాకలపూడి బీచ్ నుంచి ఫైబర్ బోటులో సముద్రంలోకి బయలుదేరారు. తిరిగి వస్తుండగా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒక్కసారిగా భారీ గాలులు వీచాయి.
దానికి తోడు అధిక ఆటుపోట్లు రావడంతో వాటి తాకిడికి పడవ బోల్తా పడింది. మరికొద్ది గంటల్లో ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉండగా, ప్రమాదం జరగడంతో ముగ్గురు మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఇద్దరు సత్తిరాజు, మైలపల్లి కృపాదాలు అదృశ్యమయ్యారు. రెస్క్యూ అధికారులు మంగళవారం గాలింపు ప్రారంభించారు.