గుంటూరు నగరంలో వివాదస్పదంగా మారిన జిన్నా టవర్ రంగుమారుతోంది. జిన్నా టవర్ కు త్రివర్ణ పతాక రంగులను మున్సిపల్ అధికారులు వేశారు. జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేయాలని బిజెపి శ్రేణులు ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆ టవర్ పై జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానించడం భారతీయ జనతాపార్టీ విజయమని బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు.
జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగర వేయడం మాత్రమే కాదని ఆ టవర్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ముందుగానే ఫిబ్రవరి 5వ తేదీ డెడ్ లైన్ ప్రకటించిన విధంగా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. దేశభక్తి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు.