TS BJP: అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ప్రజా ‘సంగ్రామ యాత్ర’ ముగింపు సభ. – బండి సంజయ్’..!

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 08:06 PM IST

రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో నిర్వహించే ముగింపుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున జనాన్ని సమీకరించి లక్షలాది మందితో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. బూత్ అధ్యక్షుడు సహా ప్రతి పోలింగ్ బూత్ నుండి కనిష్టంగా 20 మందిని తరలించాలని, నియోజకవర్గానికి 5 వేలకు తక్కువ కాకుండా ప్రజలను, కార్యకర్తలు ముగింపు సభకు హజరయ్యేలా ప్రణాళిక రూపొందించింది. కాంగ్రెస్ ఇటీవల వరంగల్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ కంటే నాలుగైదు రెట్లు అధికంగా ప్రజలను సమీకరించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను గట్టిగా ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది. అందులో భాగంగా బండి సంజయ్ కుమార్ గత రెండ్రోజులుగా వరుసగా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. జిల్లాల వారీగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమైన బండి సంజయ్… పాదయాత్ర ముగింపు సభ విజయవంతానికి అవసరమైన జన సమీకరణ, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈరోజు (ఆదివారం) సాయంత్ర్రం పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో వేర్వేరుగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని చెప్పారు.

పాలమూరు జిల్లా ఎడారిని తలపిస్తోందని, ఎటు చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు దుస్థితి చూసి చలించని, కన్నీళ్లు పెట్టని వారుండరని అన్నారు. జనం స్వచ్ఛందంగా పాదయాత్రకు తరలివస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. పాదయాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్ కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయన్నారు. వీటికి కొనసాగింపుగా కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్ర ముగింపు సభకు జనాన్ని తరలించాలని సూచించారు.

ఈ సభ సక్సెస్ ద్వారా బీజేపీ అధికారంలో రాబోతుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రతి బూత్ అధ్యక్షుడు తనతోపాటు 10 నుండి 20 మందిని సభకు తీసుకురావాలని కోరారు. దూర ప్రాంతాల మండలాల నుండి వెయ్యి నుండి 5 వేల వరకు, హైదరాబాద్ సమీప జిల్లాలు, మండలాల నుండి 5 నుండి 10 వేల చొప్పున జన సమీకరణ చేయాలని సూచించారు. అందులో భాగంగా పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా విచ్చేస్తున్నారనే విషయాన్ని ఊరూవాడా ప్రచారం చేయాలని కోరారు.

ఎక్కడిక్కడ డప్పు చాటింపులు, ర్యాలీలు, మీడియా సమావేశాలతోపాటు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరూ సభకు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. దీంతోపాటు రేపటి నుండి మండలాలు, జిల్లాల కేంద్రాల్లో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, కరెంట్ బిల్లులను దగ్దం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల మైనారిటీల చేతిలో హత్యకు గురైన దళిత బిడ్డ నాగరాజు ఘటనలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని సూచించారు బండి సంజయ్.