Bandi: ‘ఆర్థిక పరిస్థితి’పై శ్వేత పత్రం విడుదల చేయాలి!

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

  • Written By:
  • Updated On - March 29, 2022 / 10:29 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ… రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పూర్తిగా దివాళా తీయించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా జీతాలు చెల్లిస్తూ ప్రతి నెలా రెండోవారం దాకా సాగదీస్తున్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ కన్షెషన్, సరెండర్ బిల్లులు గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే… రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముందని ప్రశ్నించారు బండి సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, కుటుంబ సభ్యులకు చికిత్స చేయించుకోవాలని ఆరాట పడుతుంటే… వాటిని కూడా చెల్లించకపోవడం అత్యంత దురదుష్టకరం. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత 2 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారో? సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నిజంగా తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగుల బడ్జెట్ కలిగిన రాష్ట్రమైతే… ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాలకు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? వాయిదాల పద్దతిలో మాదిరిగా ఒక్కోరోజు ఒక్కో జిల్లాకు చొప్పున ప్రతినెలా రెండో వారం దాకా జీతాలను చెల్లిస్తూ ఎందుకు సాగదీస్తున్నారు? అని ప్రశ్నించారు బండి. ఉద్యోగ, ఉపాధ్యాయులు 2020 జులై తర్వాత సమర్పించిన వేలాది పెండింగ్ బిల్లులను 2021 మార్చి 31 నాడు ఎందుకు తిరస్కరించింది ఈ ప్రభుత్వం?…. ఆ తరువాత 2021 నుండి సమర్పించిన పెండింగ్ బిల్లులను కూడా ఆర్దిక సంవత్సరం ముగుస్తున్నా… ఇంకా ఎందుకు చెల్లించడంలేదు. మార్చి 31 లోపు పెండింగ్ బిల్లులు పాస్ కాకపోతే పరిస్థితి ఏమిటి? అని కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు బండి సంజయ్. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు.

హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయకపోవడంతో ఉద్యోగులు నానా యాతనలు పడుతుంటే ఎందుకు స్పందించడం లేదు? ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా? ఇకపై ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్ని అదేరోజు అందించి ఆనందంగా ఇంటికి పంపుతామని అసెంబ్లీ సాక్షిగా ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి? ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా నెలల తరబడి ఉద్యోగికి రావలసిన బకాయిలు రాక పోవడం దారుణం అని అన్నారు బండి సంజయ్. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా… రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు బండి సంజయ్.