Balakrishna Warning : ఏపీలోని జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తాం. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడతాం. మొరిగితే పట్టించుకోను. అతిక్రమిస్తే ఉపేక్షించను’’ అని ఆయన తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో అవినీతి జరిగిందనే అంశాన్ని క్రియేట్ చేసి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. కక్ష సాధింపు వైఖరితోనే చంద్రబాబును జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ‘‘ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయం’’ అని బాలయ్య (Balakrishna) తేల్చి చెప్పారు.
గతంలో జగన్ జైలుకు వెళ్లొచ్చారని.. ఇప్పుడు అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని విమర్శించారు. ‘‘జగన్పై అనేక కేసులున్నాయి. అయినా బెయిల్పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు జగన్ పాల్పడుతున్నారు’’ అని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం మోడల్ అనేది తొలుత గుజరాత్లో ప్రారంభమైందన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కేవలం పాలసీ మేకర్ అని.. అధికారులే దాన్ని అమలు చేస్తారని బాలయ్య (Balakrishna) స్పష్టం చేశారు. ఈ స్కీమ్ ను అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్చంద్రారెడ్డి అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసి, 2.13 లక్షల మందికి వివిధ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చిందన్నారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం కూడా అభినందన లేఖ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.