Minister Cry : డీఎంకే నేత, తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ వెక్కివెక్కి ఏడ్చారు. జయలలిత హయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో ఉద్యోగాల కోసం లంచాలు పుచ్చుకొని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఆయన ఇళ్ళు, సన్నిహితుల నివాసాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేసింది. బుధవారం తెల్లవారుజామునే సెంథిల్ ను కస్టడీలోకి తీసుకుంది. ఈక్రమంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది.
Also read : Enforcement Directorate: 374 మందిని అరెస్టు చేసిన ఈడీ.. గత ఐదేళ్లలో 3497 కేసులు నమోదు..!
దీంతో వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఒమందూరార్ ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి సెంథిల్ బాలాజీని తరలించారు. ఆ ఆస్పత్రికి తీసుకొచ్చిన అంబులెన్స్లో నుంచి ఏడుపులు వినిపించాయి. మంత్రి సెంథిల్ బాలాజీ వెక్కివెక్కి ఏడుస్తూ(Minister Cry) కనిపించారు. ఈక్రమంలో ఆసుపత్రి వద్ద ఆయన మద్దతుదారులు దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
“మంత్రి సెంథిల్ బాలాజీ ఐసీయూలో ఉన్నాడు. అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. పిలిచినా పలకడం లేదు. ఇంకా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నాడు. అతని చెవి దగ్గర వాపు ఉంది.. ECG చేయగా .. గుండె కొట్టుకోవడంలో తేడా ఉందని గుర్తించారు. మంత్రిని ఈడీ శారీరకంగా హింసించింది అనేందుకు ఇవే సాక్ష్యాలు” అని డీఎంకే నేత పీకే శేఖర్ బాబు మీడియాకు చెప్పారు.
తమిళనాడు సెక్రటేరియట్లో మంగళవారం రాత్రి ఈడీ అధికారులు సోదాలు జరపడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించారు. సెక్రటేరియట్పై దాడులు నిర్వహించడం అంటే.. దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించడమే అవుతుందని ఆయన కామెంట్ చేశారు. ఎవరిపై దాడులు చేశారన్నది ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో దాడులు నిర్వహించడం సమాఖ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రైడ్ సూచిస్తోందని పేర్కొన్నారు.