Bonalu: తెలంగాణ సంస్కృతిని చాటేలా బోనాలు!

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

  • Written By:
  • Updated On - June 6, 2022 / 05:45 PM IST

తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం MCHRD లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దేవాలయాల కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 30 న గోల్కొండ బోనాలు, జులై 17 న సికింద్రాబాద్, 24 వ తేదీన  హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా బోనాలను ఘనంగా జరుపుకోలేకపోయినట్లు  చెప్పారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో  ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రయివేట్ దేవాలయాలకు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.  ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా  అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.

GHMC ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం ప్రభుత్వం అంబారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో LED స్క్రీన్ లు, త్రీడీ మ్యాపింగ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి CC కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.