Murder: పరువు కోసం అల్లుడిని చంపిన మామ..!!!

పరువు కోసం ప్రాణాలు బలిగొనడం. ఇలాంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. బిడ్డలు తమను కాదని..

  • Written By:
  • Updated On - April 18, 2022 / 09:46 AM IST

పరువు కోసం ప్రాణాలు బలిగొనడం. ఇలాంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. బిడ్డలు తమను కాదని…నచ్చిన వాళ్లను పెళ్లిచేసుకున్నారన్న కోపంతో కిరాతకులుగా మారుతున్నారు. రెండు సంత్సరాల క్రితం మిర్యాలగూడలో మారుతీరావు చేసిన ఘోరం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రణయ్ , అమృతలను వేరు చేసేందుకు కిరాయి రౌడీలతో అల్లుడిని హత్య చేయించాడు. అలాంటి ఘటనే ఇప్పుడు మరోటి కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ పరువు హత్య తెరపైకి వచ్చింది. రెండ్రోజుల క్రితం కనిపించకుండాపోయిన రామకృష్ణగౌడ్ అనే మాజీ హోంగార్డ్ శవం సిద్దిపేట దగ్గర లభ్యమైంది. రామకృష్ణగౌడ్‌ భార్య భార్గవి ఈనెల 15వ తేదిన ఇంట్లోంచి వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా రామకృష్ణది హత్యగా గుర్తించారు పోలీసులు. హత్య చేయించింది రామకృష్ణగౌడ్‌ పల్లెపాటి వెంకటేష్‌గా గుర్తించారు. అయితే హత్య చేయించడానికి గల కారణాలు తెలుసుకున్న పోలీసులు ఖంగుతున్నారు. 20నెలల క్రితం రామకృష్ణగౌడ్ తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. తమ కూతురును దూరం చేశాడన్న కోపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

రామకృష్ణగౌడ్ ది వలిగొండ మండలం లింగారాజుపల్లి. హోంగార్డుగా పనిచేస్తున్నసమయంలో యాదగిరిగుట్టకు చెందిన భార్గవితో పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2020 ఆగస్టు 16న ప్రేమ వివాహం చేసుకుని లింగరాజుపల్లిలో కాపురం పెట్టారు. భార్గవి గర్భం దాల్చడంతో కాపురం భువనగిరి మార్చారు. ఈ మధ్యనే రామకృష్ణగౌడ్, భార్గవి దంపతులకు ఓ పాప జన్మించింది. తుర్కపల్లిలో గుప్త నిధుల తవ్వకాల కేసులో హోంగార్డ్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు రామకృష్ణగౌడ్. ఈ మధ్యనే రియల్‌ ఎస్టేట్ ఫీల్డ్‌లోకి దిగాడు. రామకృష్ణగౌడ్‌పై భార్గవి తండ్రి పగ పెంచుకున్నాడు. తమ కూతురును తమకు దూరం చేశాడన్న కోపంతో రగిలిపోయిన భార్గవి తండ్రి..ఓ వీఆర్ఎష్ తో పాటు లతీఫ్ అనే రౌడీషీటర్ తో కలిసి రామకృష్ణ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే 15న రామకృష్ణగౌడ్‌ని రియల్ ఎస్టేట్ వ్యవహారాల గురించి మాట్లాడాలని బయటకు పిలిపించారు. కిడ్నాప్ చేసి భువనగిరి నుంచి ఎత్తుకెళ్లిన నిందితులు రామకృష్ణగౌడ్‌ ను చంపారు. శవాన్ని సిద్ధిపేట పరిసరాల్లో పడేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు భార్గవి తండ్రి వెంకటేశ్ తోపాటు ఓ వీఆర్వో, లతీఫ్ అనే రౌడీ షీటర్ తోపాటు మరికొందరి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రధాన సూత్రదారలేవరు…ఎవరు కిడ్నాప్ చేశారు…ఎంత సుఫారీ తీసుకున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.