Site icon HashtagU Telugu

Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’

పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సిన బాధ్యత పాలసీ తీసుకునే వారిపై ఉంటుంది. అయితే ప్రపోజర్ తనకు తెలిసిన వాటినే వెల్లడించగలడు. ఒక్కసారి పాలసీ జారీ చేయడం పూర్తయితే.. బీమా సంస్థ ముందు నుంచి ఉన్న సమస్య అంటూ క్లెయిమ్ ను తిరస్కరించరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

మన్మోహన్ నందా అనే వ్యక్తికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. అమెరికా వెళుతూ ఆయన ఓవర్సీస్‌ మెడిక్లెయిమ్‌ బిజినెస్‌ అండ్‌ హాలిడే పాలసీ తీసుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం చేరుకున్న తర్వాత హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండె రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించిన డాక్టర్లు మూడు స్టెంట్లు వేశారు.

నందా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అతడికి ముందునుండే హైపర్ లిపిడేమియా, మధుమేహం సమస్యలు ఉన్నాయని, స్టాటిన్ మాత్రలు వాడుతున్నా కానీ పాలసీ కొనుగోలు చేసే సమయంలో వెల్లడించలేదని బీమా సంస్థ క్లెయిమ్ ను తిరస్కరించింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లోనూ పాలసీదారుకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. ఉన్నట్టుండి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన నేపథ్యంలో పాలసీదారు రక్షణ కోసమే పాలసీ తీసుకుంటారన్న సూక్ష్మ అంశాన్ని కోర్టు గుర్తు చేసింది.

Exit mobile version