ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో రష్యా బలగాలు ఆడిన పైశాచిక క్రీడ తాలూకు పలు ఆధారాలు వెల్లడయ్యాయి. రష్యా సైన్యం కాల్చి చంపిన మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. రష్యా బలగాలు ఉక్రెయిన్ మహిళలను చంపడానికి ముందు వారిలో కొంతమందిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోస్టుమార్టం నివేదికలు బహిర్గతం చేశాయి. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఉక్రెయిన్ ఫోరెన్సిక్ వైద్యుడు వ్లాడిస్లావ్ పెరోవ్స్కీ తెలిపారు. తమ బృందంతో కలిసి 12 మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. అత్యాచార కేసులంటే సున్నితమైనవని, దీనిపై సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నందున ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. మహిళల వందలాది మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉందని పెరోవ్స్కీ చెప్పారు.