AP Project: ఏపీలో ప్రారంభంకాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్‌.. !

ఏపీలో మ‌రో భారీ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ కంపెనీ ముందుకు వ‌చ్చింది.

  • Written By:
  • Publish Date - December 20, 2021 / 07:59 PM IST

ఏపీలో మ‌రో భారీ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ కంపెనీ ముందుకు వ‌చ్చింది.ఈ ప్రాజెక్టుని 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ని శ్రీ సిమెంట్‌ గ్రూప్ ఏర్పాటు చేసింది.తాజాగా శ్రీ సిమెంట్‌ గ్రూప్‌ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ప్రారంభంకాబోతుంది.ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్ క‌లిసి చ‌ర్చించారు.

ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను శ్రీ సిమెంట్ ఎండీకి సీఎం జ‌గ‌న్ వివ‌రించారు. రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్ అన్నారు. ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగులకోసం ముఖ్యమంత్రిగారు కూడా అలాగే పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని.. రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారని బంగూర్ తెలిపారు.

దేశం కంటే రాష్ట్ర వృద్దిరేటు అధికంగా ఉందని… భవిష్యత్తులో కూడా ఇది మరింతగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని.. అందువల్లే మేం ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నామ‌ని బంగూర్ తెలిపారు. శ్రీ సిమెంటు ప్లాంటులో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నామ‌ని.. రోజువారీ ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా డబ్బును వారికి ఇస్తున్నామ‌న్నారు.