INDIA Meet-Mumbai : కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి “ఇండియా” మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండ్రోజుల పాటు తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని శివసేన (ఉద్ధవ్ థాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈనెల 31న సాయంత్రం నుంచి ఒక సమావేశం, సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటల నుంచి మరో సమావేశం ప్రారంభమవుతాయని చెప్పారు. విపక్ష పార్టీల ముఖ్య నేతలతో పాటు ఐదుగురు సీఎంలు ఆగస్టు 31న శివసేన (ఉద్ధవ్ థాకరే) ఇచ్చే డిన్నర్లో పాల్గొంటారని, ఆ తర్వాత మీడియా సమావేశం ఉంటుందని తెలిపారు.
Also read : Ziva Dhoni: ధోనీ కుమార్తె జీవా స్కూల్ ఫీజ్ ఎంతో తెలుసా?
శనివారం మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కూటమి నేతలతో మీటింగ్ ముగిసిన అనంతరం ఈవివరాలను సంజయ్ రౌత్ ప్రకటించారు. విపక్ష కూటమి సమావేశాల(INDIA Meet-Mumbai) విజయవంతానికి నేతలందరూ ఒక్కో బాధ్యత తీసుకోనున్నారని చెప్పారు. కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీతో సహా పర్యటనకు వచ్చే నేతలకు భద్రతపై ఎంవీఏ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారని సంజయ్ రౌత్ చెప్పారు.ఎంవీఏ సమావేశంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ నేతలు మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్ పాల్గొన్నారు. 26 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరగగా, మూడో సమావేశం ముంబైలో జరగనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.