యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షడు అసదుద్ధీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఒవైసీ పై దాడి జరగడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ దాడి ఘటన పై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ ఎం శశిధర్ రెడ్డి ఓ పత్రికా ప్రకటన ద్వారా స్పందిచారు.
ఎంపీ ఒవైసీ పై జరిగిన కాల్పుల ఘటనను ఖండిస్తూ.. ఆయనకు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా కేమంగా పడడం ఊరనిచ్చే విషయమని శశిధర్ రెడ్డి అన్నారు. ఉత్తరప్రదేశ్లో హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ఘటన, పలు అనుమానాలకు దారి తీస్తోందన్నారు. ఎన్నికలను పోలరైజ్ చేసేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోందని శశిధర్ రెడ్డి అన్నారు.
యూపీ ప్రజల్లో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, దీనికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా, వారి వెనుక ఉన్నవారిని కూడా బహిర్గతం చేసేందుకు సమగ్ర దర్యాప్తు చేయించాలని శశిధర్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉన్నా, ఇలాంటి ప్రయత్నాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు.
ఇక ఓవైసీ భద్రత గురించి తాను వ్యక్తిగతంగా ఆందోళణ చెందుతున్నానని, వెంటనే ఆయనకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని శశిధర్ రెడ్డి కోరారు. అనూహ్యంగా తన కాన్వాయ్ పై కాల్పులు జరిగిన నేపధ్యంలో ఒవైసీ ఇకముందు మరింత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగతంగా కూడా అన్నిరకాలుగా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, మీరట్ నుండి తిరిగి వస్తున్న ఎంపీ ఒవైసీ కాన్వాయ్ జరిగిన సంగతి తెలిసిందే.