Sharad Pawar – Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మధ్య ఏదో జరుగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఏవిధంగా మారుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి తనపై తిరుగుబాటుచేసి బీజేపీ సర్కారులో చేరిన అజిత్ పవార్ పై శరద్ పవార్ విమర్శలు చేయకపోగా, అతడిని వెనకేసు వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కోల్హాపూర్ కు వెళ్లే ముందు పూణెలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ శరద్ పవార్ ఆవిధమైన కామెంట్సే చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తిరుగుబాటు అనేది.. కేవలం భిన్న వైఖరిని తీసుకోవడం మాత్రమేనని తేల్చి చెప్పారు.
‘అజిత్ పవార్ తో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ విధానానికి విరుద్ధమైన వైఖరిని తీసుకున్నారు. ఈవిధంగా విరుద్ధమైన వైఖరిని తీసుకునే హక్కు వారికి ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదనీయమే’ అని శరద్ పవార్ (Sharad Pawar – Ajit Pawar) కామెంట్ చేయడం గమనార్హం. తాను ఇప్పటికీ ఎన్సీపీ నేతనే అని అజిత్ పవార్ చెబుతున్న విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. ‘‘అజిత్ పవార్ మా పార్టీ లీడరే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మా పార్టీ చీలలేదు. అజిత్ మావాడే అంటే ఏంటి ? జాతీయ స్థాయిలో ఓ పార్టీలో మెజారిటీ వర్గం వేరుపడినప్పుడే ఇది సాధ్యపడుతుంది. కానీ, అలాంటి పరిణామం ఏదీ ఇక్కడ జరగలేదు కదా’’ అని ఎన్సీపీ చీఫ్ వ్యాఖ్యానించారు.