KTR: తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్

  • Written By:
  • Updated On - April 19, 2024 / 12:12 AM IST

KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని, 2001 లోనే హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ అని,  గెలిచినా, ఓడినా కేసీఆర్ తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అని కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ అన్న పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి  వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో విపక్షాలు ఐతే జేబులో లేదంటే జైల్లో అన్నట్లుగా ఉంది ప్రధాని మోడీ విధానమని. మైనార్టీ సోదరులు ఒక్కసారి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించాలె అని కేటీఆర్ అన్నారు.

‘‘గతంలో ఒకరి పండుగలకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుని పరిస్థితి ఉండే. ఇప్పుడు దేశంలో మోడీ ఆ వాతావారణాన్ని చెడగొట్టి మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. అలాంటి బీజేపీని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది మనమే. కాంగ్రెసోళ్లు వచ్చి బీజేపీ కి మనం బీ టీమ్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ బండి సంజయ్, ఈటల, ధర్మపురి సంజయ్, రఘనందన్ రావు, బాపురావు ను ఓడించిందెవరో గుర్తు తెచ్చుకోవాలె’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

‘‘బద్మాష్ రాజాసింగ్ కూడా ఓటమి నుంచి కాస్తలో తప్పించుకున్నాడు. కిషన్ రెడ్డి ని కూడా ఓడించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. కిషన్ రెడ్డి కరోనా టైమ్ లో సికింద్రాబాద్ లో కుర్ కురే ప్యాకెట్లు పంచిండు. కేసీఆర్ గారు కాళేశ్వరం లిప్ట్ లను ప్రారంభిస్తే.. కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్ లో లిప్ట్ ను ఓపెన్ చేసిండు. సింటిక్స్ ట్యాంకర్, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఒక్క షెడ్ ను మాత్రమే కట్టించిండు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి, సికింద్రాబాద్ కు చేసివని ఈ మూడు పనులు మాత్రమే’’ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేశారు కేటీఆర్.

‘‘మూసీ కి వరదలు వస్తే వెయ్యి కోట్లు అడిగితే రూపాయి కూడా సాయం చేయలే. బీజేపీ ని ఏం చేసినవ్ అని అడిగితే చెప్పేందుకు ఒక్కటి కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచిత్రమైన పరిస్థితి కనబడుతోంది. రాహుల్ బాబా ఏమో చౌకి దార్ చోర్ అంటాడు. రేవంత్ బాబా మాత్రం మోడీ బడే భాయ్ అంటాడు. రాహుల్ బాబా అదానీ ఫ్రాడ్ అంటాడు. రేవంత్ బాబా మాత్రం అదానీ మేరా ఫ్రెండ్ అంటాడు. రాహుల్ బాబా గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు. రేవంత్ బాబా మాత్రం తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు’’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.