తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, బ్రిడ్జిలు నీటితో నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. భారీ వర్షాల కారణంగా మహబూబ్నగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు వరదనీటిలో చిక్కుకుంది. ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మాచన్పల్లి-కోడూరు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీరు భారీగా చేరింది. ఈ క్రమంలో రామచంద్రపురం నుంచి సుగురు తండాకు వెళ్తున్న స్కూల్ బస్సు.. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీటిలో చిక్కుకుంది. దాదాపు సగభాగం వరకు బస్సు నీటిలో ఉండటంతో అందులోని విద్యార్థులు ఆర్తనాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం బస్సును ట్రాక్టర్ సాయంతో తీశారు.