Sanjay Bandi: కేసీఆర్’ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కండి అంటూ ప్రజలకు ‘బండి సంజయ్’ పిలుపు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - April 15, 2022 / 05:22 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెంట్ ఛార్జీల పెంపుతో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన విమర్శించారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ… ఇళ్లకు కరెంట్ ఛార్జీలను పెంచి ఏటా రూ.6 వేల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెలలో కరెంట్ బిల్లులను చూసి ప్రజలకు షాక్ కొట్టడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో పెంచిన కరెంట్ ఛార్జీలను ఉపసంహరించుకునేదాకా బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. బీజేపీ చేపట్టే ఈ పోరాటంలో ప్రజలంతా చేయి చేయి కలిపి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్… రెండోరోజైన శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇమాంపేట నుండి లింగన్ వాయి, బూడిదపాడు సెంటర్, ఉండవల్లి గ్రామాల వరకు దాదాపు 6.5 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా లింగన్ వాయి గ్రామంలో రచ్చబండ వద్ద ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంనతరం బండి సంజయ్ ప్రసంగించారు.

వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నానని కేసీఆర్ చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్దాలేనని బండి సంజయ్ అన్నారు. కరెంట్ సరఫరా చేస్తున్న విద్యుత్ సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 60 వేల కోట్ల బకాయి పడిందన్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న కేసీఆర్… డిస్కంలకు బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేరని అన్నారు. రాబోయే ప్రభుత్వంపైనే ఈ భారమంతా పడబోతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం పతనం ఖాయమని, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే డిస్కంలకు బకాయిలు చెల్లించక తప్పదని, ఆ పని బీజేపీ మాత్రమే చేస్తుందని చెప్పారు. కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చేది టీఆర్ఎస్ కానేకాదని, బీజేపీ మాత్రమేననే సంగతి ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. కరెంట్ చార్జీలు పెంపుతో ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అనుకుంటూ ఢిల్లీకి పోయాడు. ఆర్టీసీ చార్జీలు రెండుసార్లు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాడు. అందుకే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకునేదా బీజేపీ ఉద్యమిస్తుంది.

ప్రజలంతా చేయి చేయి కలిపి కదం తొక్కాలని కోరుతున్నా.. రాజోలి బండ డైవర్షన్ స్కీం నీళ్లు అలంపూర్ కు ఎందుకు రావు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఫాంహౌజ్ కు నీళ్లు మళ్లించుకున్నాడు. ఆర్డీఎస్ ద్వారా ఇక్కడి పేద ప్రజల పొలాలకు నీళ్లు ఇవ్వాలని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా రూపాయి ఖర్చు పెట్టలేదు. లింగనవాయి గ్రామంలో రామాలయం గుడి కట్టిస్తామని బడాయి కొట్టిన స్థానిక టీఆర్ఎస్ నాయకులు… ప్రజలను నమ్మబలికారు. కాని, ఇంతవరకు గుడి కట్టిన దాఖలాలు లేవు. బీజేపీ అధికారంలోకి రాగానే రామాలయ నిర్మాణాన్ని మేం కట్టి చూపిస్తాం. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి వచ్చేలా అభివృద్ధి చేస్తామని అన్నారు బండి సంజయ్.
తెలంగాణలోని పల్లెల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పొద్దున్నే లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునేదాకా ప్రజలు అవసరమైన వాటిన్నింటినీ నెరవేరుస్తున్న ప్రభుత్వం కేంద్రమే. అందులో భాగంగా మరుగుదొడ్డి మొదలు వంటగ్యాస్ సిలిండర్, కరోనా వ్యాక్సిన్ సహా అన్నీ సమకూరుస్తున్న ప్రభుత్వం మోదీదే.

గ్రామంలో నిర్మించిన రోడ్లు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలతోపాటు ఉపాధి పథకం హామీ నిధులన్నీ కేంద్రం ఇచ్చేవే. పేదలకు అందించే ఉచిత రేషన్ బియ్యానికి అయ్యే సొమ్మంతా చెల్లించేది కేంద్రమే. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం సిగ్గు లేకుండా కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో పేదలు, యువత, సబ్బండ వర్ణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు… పేదలకు ఇండ్లు రానియ్యడం లేదు.. కాని….. కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు. రాష్ట్రంలో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే..
పేదోళ్లు గొర్లు, బర్లకే పరిమితం కావాలి. ఇదే కేసీఆర్ దురాలోచన. అలంపూర్ లో పేదల బతుకులు దారుణంగా మారాయి. కనీసం 100 పడకల ఆస్పత్రి లేదు. రోగమొస్తే కర్నూలులోని దవాఖానకు వెళ్లాల్సిన దుస్థితి. పేదలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పిస్తే.. కేసీఆర్ మాత్రం అది అమలు చేయకుండా వంచిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికల్లేవు. ఓట్ల కోసం మీ వద్దకు రాలేదు. మేం చెప్పే విషయాలపై వాస్తవాలు తెలుసుకోండి. టీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి. వచ్చే ఎన్నికల్లో అబద్దాలు చెబుతున్న టీఆర్ఎస్ ను ఓడించండి. బీజేపీకి అధికారం ఇవ్వండి అని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.