తిరుపతి నగరంలోని భాకరాపేట మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.