యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని హయత్నగర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతులు డి.నాగలక్ష్మి (28), వరకంఠం అనసూయ (55), చిలువేరు ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష (30)గా గుర్తించారు. బాధితులు ఓ కంపెనీ ఇండస్ట్రియల్ పార్కులో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరో కూలీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 12 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.