జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకల ఏర్పాట్లు (Republic Day Celebrations) ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్(Hyderabad Shamshabad Airport)లో సైతం భద్రతా చర్యలు మరింత కఠినతరం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర నిఘా సంస్థల సూచనల మేరకు జనవరి 30 వరకు రెడ్ అలర్ట్ (Red Alert ) ప్రకటించారు.
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. దావోస్ వేదికపై సీఎం రేవంత్ సరికొత్త రికార్డు!
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన గేట్ల వద్ద ప్రవేశించే ప్రతీ వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించే అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా చర్యలలో భాగంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీములను రంగంలోకి దించారు. ఈ టీమ్స్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికులు తీసుకువస్తున్న బ్యాగ్ లు, వాహనాలు అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి ముందుగానే భద్రతా చర్యలు ముమ్మరం చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక సదుపాయాలను అందిస్తున్నారు.
సాధారణ ప్రజలు భద్రతా చర్యలకు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తుల వివరాలను వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలని సూచిస్తున్నారు.