వివాదాల రారాజు, జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నిత్యం ఏదో ఒక వివాదంతో సహ జీవనం చేస్తూనే ఉంటాడు. ఆర్జీవీ అంటేనే ఓ సెన్షషన్, వర్మ ఏం మాట్లాడినా కాంట్రవర్సీనే.. ఏ ట్వీట్ చేసినా ఏదో ఒక వివాదం ఉంటుంది. ఆర్జీవీ ట్వీట్లు వోడ్కా వేయకముందు ఒకలా, ఓడ్కా వేశాక మరోలా ఉంటాయి. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ మరణించడంతో దేశంలో ఉన్న అన్ని సినిమా పరిశ్రమలు విషాదంలో మునిగిపోయాయి. అయితే వర్మ మాత్రం చావుల పై తనదైన శైలిలో ట్వీట్ చేసి కొత్త లాజిక్ను తెరపైకి తెచ్చారు.
మనిషి చనిపోతే బాధపడొద్దని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ, ఆర్ఐపీ(RIP) అని చెప్పడం వారిని అవమానించడమే అని అంటున్నారు. RIP అంటేనే అవమానకరమని, మరణించిన వారిని తాను ద్వేషిస్తున్నానని అన్నారు. జీవించి ఉన్న వారికంటే చనిపోయిన వారికే మెరుగైన జీవితం ఉంటుందంటున్న ఆర్జీవీ.. మరణించిన తర్వాత అక్కడ స్వర్గంలో అమృతంతో పాటు రంభ, ఊర్వశి, మేనక లాంటి సృస్టిలోనే అందమైన మహిళలు ఉంటారని, అలాగే అక్కడ ఇంద్రభవనం లాంటి మంచి ఇల్లు ఉంటుందని, అందుకే త్వరగా చనిపోయిన వారు అదృష్టవంతులని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.
ఇక చావుకు భయపడేవాళ్లు అత్యంత పిరికి వాళ్ళగా తాను భావిస్తానని, వారంతా పాపం చేసినట్లు భావించబట్టే నరకానికి వెళ్లడానికి భయపడతారని వర్మ అన్నారు. ఎవరైనా చనిపోతే వారి కుంటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభలాషులు, బాధపడకుండా సదరు వ్యక్తి చావును సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్జీవీ సలహా ఇచ్చారు. అలాగే చనిపోయిన వారికి RIP అని చెప్పే బదులు హయిగా మంచి జీవితాన్ని గడపండి, ఇకముందు మరింత ఆనందించండని చెప్పాలని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. దీంతో చావుల పై ఆర్జీవీ నయా లాజిక్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా సిట్యువేషన్ ఏదైనా, ఆర్జీవీ చూసే కోణం, ఎంతో భిన్నంగా ఉంటుందని, నీకు.. నీ లాజిక్స్కు ఓ దండం సామీ అంటూ సోషల్ మీడియాలో సర్వత్రా చర్చించుకుంటున్నారు.