Punjab CM: పంజాబ్ సీఎం సంచలనం.. హెల్త్ మినిస్టర్ ఔట్!

ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పంజాబ్ సీఎం వేటు వేశారు.

  • Written By:
  • Updated On - May 24, 2022 / 03:43 PM IST

దేశంలో అవినీతి అక్రమాలను రూపుమాపడమే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైంది. అలాంటి పార్టీలో  నేతలు అవినీతికి పాల్పడితే ఆప్ అధిష్టానం ఊరుకుంటుందా.. ? తగ్గేదేలే అంటూ వెంటనే వేటు వేసి దేశ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన కేబినెట్ లోని ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడం, అవన్నీ నిజమని స్పష్టంకావడంతో అతనిని మంత్రివర్గం నుంచి తొలగించారు. టెండర్లపై ఒక శాతం కమీషన్ Mr సింగ్లా డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలొచ్చాయి. దీంతో మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే.. పంజాబ్ పోలీసుల అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.

10 రోజుల క్రితమే మంత్రిపై ఫిర్యాదు అందడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి తమ సొంత మంత్రివర్గ సహచరుడిపై ఇంత కఠిన చర్యలు తీసుకోవడం దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2015లో అవినీతి ఆరోపణలపై తన మంత్రిలో ఒకరిని తొలగించారు.

సింగ్లా అవినీతిపై 10 రోజుల క్రితం ఓ ప్రభుత్వ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ‘‘మీకు అండగా ఉంటా. ఏ మంత్రులకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని ముఖ్యమంత్రి స్వయంగా అధికారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారి సహాయంతో ఆపరేషన్‌ చేయగా.. మంత్రి, ఆయన సన్నిహితులు ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడైంది. కాల్ రికార్డింగ్‌లు, ఇతర సాక్ష్యాలను సేకరించిన తర్వాత  పంజాబ్ సీఎం మాన్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా అవినీతిని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

“ఒక శాతం అవినీతిని కూడా సహించబోం” అని మిస్టర్ మాన్ ఒక వీడియో సందేశంలో తెలిపారు. “ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓట్లు వేశారని, దానికి అనుగుణంగా మనం జీవించాలని, అరవింద్ కేజ్రీవాల్ లాంటివారు, భగవంత్ మాన్ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై మహా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది’’ అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక నమూనాకు అనుగుణంగానే ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పేర్కొంది. కేజ్రీవాల్ భగవంత్ మాన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. “భగవంత్ మీ గురించి గర్వపడుతున్నాను. నీ చర్య నా కన్నీళ్లను తెప్పించింది. ఈ రోజు మొత్తం దేశం ఆప్ పట్ల గర్వంగా ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.