Praful Patel-Fadnavis-Modi : ఎన్సీపీ నుంచి 30 మందికిపైగా ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై తిరుగుబాటు చేసిన మేనల్లుడు అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి లభించింది. ఇక ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న శరద్ పవార్ నమ్మిన బంటు ప్రఫుల్ పటేల్ కూడా తిరుగుబాటు చేసిన నేతల లిస్టులో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో తిరుగుబాటుకు గిఫ్ట్ గా ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం దక్కొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం(ఇవాళ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ దిశగా ఏవైనా నిర్ణయాలు వెలువడొచ్చనే చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు జరగొచ్చని అంటున్నారు. ఈనేపథ్యంలో గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన అనుభవమున్న ప్రఫుల్ పటేల్ కు కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ దక్కొచ్చని భావిస్తున్నారు.
Also read : Lighten Dark Elbows: మోచేతులు, చంకల్లో నలుపుదనం పోవాలంటే ఈ 4 చిట్కాలు పాటించాల్సిందే?
ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్కు స్వేచ్ఛను ఇచ్చేందుకు వీలుగా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా ప్రధాని మోడీ క్యాబినెట్లోకి తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, మోడీ క్యాబినెట్లో తన చేరికపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని, తమ పార్టీ కూడా ఆ డిమాండ్ చేయలేదని ప్రఫుల్పటేల్ వివరణ ఇవ్వడం గమనార్హం. “ఎన్సీపీ మొత్తం తమ వెంటే ఉంది” అని అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ అంటుండగా.. ” ఆ తిరుగుబాటు అజిత్ పవార్ వ్యక్తిగతమైంది” అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వాదిస్తున్నారు.