ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తోన్న భారతీయులకు ఓటు హక్కు కల్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రస్తుతానికి విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎన్నారైలను ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కోరారు. విదేశీ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) సదుపాయాన్ని పొడిగించే ఆలోచన ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల దక్షిణాఫ్రికా, మారిషస్లో పర్యటించినప్పుడు ఎన్ఆర్ఐల కోసం పోస్టల్ బ్యాలెట్ల ప్రతిపాదన గురించి ఆలోచించినట్లు ఈసీ చంద్ర చెప్పారు. ఆయన నేతృత్వంలో ప్రతినిధి బృందం ఏప్రిల్ 9 నుండి 19 వరకు దక్షిణాఫ్రికా , మారిషస్లను సందర్శించింది.
NRIలకు ఆన్లైన్ ఓటింగ్ను అనుమతించే అవకాశాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఆ విషయాన్ని మార్చిలో లోక్సభకు న్యాయ మంత్రి కిరెన్ రిజిజు తెలియజేసిన విషయాన్ని ఈసీ చెప్పింది. ఎన్ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయడానికి అనుమతించాలని 2020లో న్యాయ మంత్రిత్వ శాఖకు EC లేఖ రాసింది. ఆ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇతర దేశ పౌరసత్వాన్ని పొందనంత వరకు విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నారైలకు ప్రస్తుతం EC అనుమతిస్తోంది. అయితే, వారు ఓటింగ్ రోజున వ్యక్తిగతంగా ఓటు వేయడానికి సంబంధిత పోలింగ్ బూత్లకు చేరుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం పరిశీలిస్తోంది.