Multipurapose Industrial Park : లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వం నిన్న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే దీని స్థానంలో మల్టిపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో దుద్యాల మండలం లగచర్లలో 110.32 భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి తొలుత ప్రభుత్వం భూములను సేకరించనుంది. పోలేపల్లిలో 71.89 ఎకరాలను సేకరించనున్నారు. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం నోటిఫికేషన్ను విడుదల చేశారు.
వికారాబాద్ జిల్లా లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్కు ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేసింది. సర్వే నంబర్, రైతు పేరుతో సహా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల అంగీకారంతోనే భూ సేకరణ చేస్తామని..బలవంతంగా భూములు లాక్కోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి మొదట భూసేకరణ చేయనుంది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల లగచర్ల ఫార్మా విలేజ్ భూసేకరణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్పై గ్రామస్థులు దాడి చేయడం ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా 28 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యలపై గ్రామస్థులు ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ జరిపింది. ఈ క్రమంలో ఫార్మా విలేజ్ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాని స్థానంలో మల్లిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సర్కార్ కొత్త నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది.
Read Also: Liquor Prices Reduced : మందుబాబులకు గుడ్ న్యూస్.. మూడు మద్యం బ్రాండ్ల ధరలు తగ్గింపు