Congress : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్ ,శంకర్ నాయక్, విజయశాంతి ఈరోజు అసెంబ్లీలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
Read Also: Pranay Murder case : ప్రణయ్ హత్య కేసు..కోర్టు సంచలన తీర్పు
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది. కానీ కొత్తగూడెం ఒకటే ఇచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ సీపీఐకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు ఒకటి దక్కనున్నాయి. తమకు వచ్చే నాలుగులో ఒక సీటును పొత్తు ధర్మం ప్రకారం సీపీఐకి హస్తం పార్టీ కేటాయించింది.
ఇక, ఈరోజుతో నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ముగియనుండగా.. ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. 2025 మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే..ఎమ్మెల్సీ టికెట్ మాజీ ఎంపీ విజయశాంతికి దక్కడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి ఎమ్మెల్సీ రేసులో రాములమ్మ పేరు లేదు. చివర్లో అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. విజయ శాంతి నేరుగా ఢిల్లీలోనే పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ టికెట్ సాధించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ హైకమాండ్ ప్రియారిటీ ఇచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ వదులుకోగా.. విజయ శాంతి మెదక్ ఎంపీ టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే వీరి త్యాగాలను గుర్తించిన అధిష్టానం.. ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది.
Read Also: parliament : మలి విడత ప్రారంభమై బడ్జెట్ సమావేశాలు.. వాయిదా