Site icon HashtagU Telugu

NEET Result 2023 : నీట్ లో తెలుగోళ్ల తడాఖా.. ఏపీ స్టూడెంట్ కు టాప్ ర్యాంక్

Neet Result 2023

Neet Result 2023

NEET Result 2023 : నీట్ యూజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్-2023) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ మెడికల్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరా వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ జే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. మొత్తం 720 మార్కుల ఈ పరీక్షలో వీరిద్దరూ 720 మార్కులతో (99.99 పర్సంటైల్) అదరగొట్టారు. ఏపీకి చెందిన వై.ఎల్.ప్రవధాన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, కె.యశశ్రీ ఎస్సీ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. టాప్ 20లో ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులు నిలిచారు. అన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు పెరిగాయి. అభ్యర్థులు తమ ఫలితాలను neet.nta.nic.in, ntaresults.nic.in అనే వెబ్ సైట్లలో చూసుకోవచ్చు.

Also read : Self-Cleaning Touch Screen: సెల్ఫ్ క్లీనింగ్ టచ్ స్క్రీన్ వస్తున్నాయి.. జనరల్ మోటార్స్ కి పేటెంట్

టాప్ 50లో 40 మంది అబ్బాయిలే 

నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష కోసం ఈ ఏడాది మొత్తం 20,87,462 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 20,38,596 మంది మెడికల్ ప్రవేశ పరీక్ష రాయగా.. 11,45,976 మంది అర్హత(NEET Result 2023) సాధించారు. అందులో ఏపీకి చెందిన 42,836, తెలంగాణకు చెందిన 42,654 మంది అభ్యర్థులు ఉన్నారు. నీట్ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలే హవా చాటారు. టాప్ 50 అభ్యర్థుల్లో 40 మంది అబ్బాయిలు, అమ్మాయిలు 10 మందే ఉన్నారు. యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు అర్హత సాధించారు. నీట్ పరీక్ష మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాల్లో మే 7న జరిగింది. మణిపూర్ విద్యార్థులకు జూన్ 6న దేశంలోని 11 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. మెడికల్, వెటర్నరీ, ఆయుష్, బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నీట్ నిర్వహిస్తారు.