మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సాయంత్రం 6 వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అధికారులు, భద్రతా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.