ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు కొత్త డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని తన తల్లిని హతమార్చాడు.కియోంజర్ జిల్లాలోని నాయకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉపరబరద గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. కొత్త బట్టలు కొనేందుకు రూ.500 ఇవ్వాలని తన తల్లిని అభ్యర్థించాడు.. అయితే అతని తల్లి ముగా శాంత నిరాకరించినట్లు నాయకోట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్వర్ణమణి హెంబ్రామ్ తెలిపారు. పదేపదే డబ్బులు ఇవ్వమని అడిగినప్పటికి తల్లి నిరాకరించడంతో బాలుడు ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మరణించిన తర్వాత కూడా బాలుడు ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. 5వ తరగతి చదువుతున్న బాలుడు గతేడాది పాఠశాలకు వెళ్లడం మానేశాడు. తన తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయాడని పోలీసులు తెలిపారు. నాయక్కోట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.