KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరంతో కేటీఆర్ భేటీ, ఓటుబ్యాంక్ పై గురి

 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) బియారెస్(BRS) పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

  • Written By:
  • Updated On - November 20, 2023 / 11:19 AM IST

KTR: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) బియారెస్(BRS) పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారితో TPTF రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ESI, EPF అమలు, 12 నెలల జీతం, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల అమలు, అధిక సమయపాలన వంటి సమస్యలతో పాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని మంత్రి గారిని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం రెగ్యులేషన్ కమిటీ వేయాలనీ , జీవో ఎమ్మెస్ నెం-1 లో మార్పులు చేసి పునరుద్దిరించాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయనీ పరిష్కారంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను U-DISE ద్వారా ఆన్లైన్ లో పొందు పరచాలనీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉపాధ్యాయుల వివరాలు వారి సంఖ్య తెలిస్తే వారికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వారికి అందేలాగా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలకు పరిష్కారం చేస్తామని , అన్ని సమస్యలను విడతల వారిగా పరిష్కరించుకుందామనీ హామి ఇచ్చారు. అనంతరం సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం 13 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ (TPTF) అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్భవించిన TPTF, నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, నేడు తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు.

కరోనా కష్ట సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మేము చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి, మానవతా దృక్పథంతో ప్రతి ప్రైవేట్ టీచర్ కు నెలకు 2 వేల రూపాయల నగదు, 25 కిలోల సన్నబియ్యాన్ని ఇచ్చి ఆదుకున్న విషయాన్ని మేము మరవలేదని తెలిపారు. భారతదేశంలోనే ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తించి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ననీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా బియారెస్(BRS) పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో ప్రాణాలకు తెగించి పోరాడిన నాయకుడు, అదే చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, సుపరిపాలనను అందించే సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ గారు అనీ‌, అతని చేతిలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.అందుకోసం రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు బియారెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తమ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చిన కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్, ప్రధాన కార్యదర్శి నిరుపమ సంజయ్, కోశాధికారి నవీన్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు రేణుక పవన్, అమీరుద్దిన్, సుబ్బలక్ష్మి, భాస్కర్ రాథోడ్, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.