ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజాని ఆ టీమ్ పక్కన పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ 2022 సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్లాడిన రవీంద్ర జడేజా కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా ఫామ్ కోల్పోయి కేవలం 116 పరుగులే చేశాడు. అటు బౌలింగ్ లో జడేజా 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇటీవల ధోనీ కెప్టెన్గా మారిన తర్వాత కూడా అతను ఫామ్ అందుకోలేకపోతున్నాడు. ఈ కారణంగానే అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ నుంచి తప్పించారు. ఈ అంశంపై మ్యాచ్ ఆరంభానికి ముందు ధోనీ మాట్లాడుతూ.. ప్రస్తుతం రవీంద్ర జడేజా పూర్తి ఫిట్గా లేడు. అందుకే అతని స్థానంలో శివమ్ దూబెని తుది జట్టులోకి తీసుకున్నామని పేర్కొన్నాడు.
అయితే బ్యాటింగ్లోనే కాదు.. బౌలింగ్, ఫీల్డింగ్లోనూ జడేజా ఈ సీజన్ లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై సీరియస్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తుది జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈనెల 4నఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దాంతో.. ఫిజియో సూచన మేరకు మైదానం వీడిన జడేజా.. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చి క్రీజులో సౌకర్యవంతంగానే కనిపించాడు. ఈ నేపథ్యంలో ఫామ్ కోల్పోయిన రవీంద్ర జడేజాని కావాలనే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం జట్టునుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సీఎస్కే గెలిచినప్పటికి ప్లేఆఫ్ అవకాశాలు లేనట్టే. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించిన ధోని సేన పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.