DGT Hacked : జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు (సెప్టెంబరు 8న) హ్యాకర్లు తెగబడ్డారు. భారత ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి .. ఆ వెబ్ సైట్ తెరుచుకోవడం లేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT.GOV.IN) వెబ్సైట్ లోకి వెళితే.. ‘దిస్ సైట్ అండర్ మెయింటెనెన్స్’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఈ హ్యాకింగ్ ద్వారా హ్యాకర్లు భారతదేశ సైబర్ మౌలిక సదుపాయాల రక్షణ వలయానికి సవాల్ విసిరారని టెక్ నిపుణులు అంటున్నారు. గానోసెక్ టీమ్ (Ganosec Team)అనే ఇండోనేషియాకు చెందిన హ్యాకర్ల గ్రూప్ ఈ సైబర్ ఎటాక్ కు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. GanoSec టీమ్ కు చాలా దేశాల్లో సభ్యులు ఉన్నారని.. వారు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కోఆర్డినేట్ చేసుకొని ఈవిధంగా సైబర్ దాడులు (DGT Hacked) చేస్తుంటారని అంటున్నారు.