Russian Universities: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులకి శుభవార్త

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు. అయితే చదువును మధ్యలోనే వదిలేయాల్సిన భారతీయ విద్యార్థులు తమ గత విద్యాసంవత్సరాలను కోల్పోకుండా రష్యన్ యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తామని న్యూఢిల్లీలోని రష్యన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ రోమన్ బాబుష్కిన్ ప్రకటించారు.

గత ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులు ఇండియా వచ్చారు. వారందరూ తిరిగి తమ చదువుని కొనసాగించవచ్చని, వారిలో స్కాలర్‌షిప్‌లను కలిగి ఉన్న వాళ్లకి రష్యన్ వర్సిటీలలో దాన్ని వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటామని రష్యన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ తెలిపారు. విద్యార్థులు తమ మార్క్‌షీట్‌లు, ఇతర విద్యా రికార్డులతో ఇక్కడి రష్యన్ హౌస్‌ని సంప్రదించవచ్చని, రష్యన్ వర్సిటీలకు వాటిని ఫార్వార్డ్ చేస్తామని ఆయన చెప్పారు.

ఉక్రెయిన్‌లో జరిగిన సంఘర్షణపై స్పందించిన బాబూష్కిన్ అక్కడి పాలన నియో-నాజీలను కాపాడుతోందని, రష్యా యొక్క లక్ష్మణ రేఖ ను ఉక్రెయిన్ దాటిన ఫలితంగా యుద్ధం జరిగిందని తెలిపారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా ద్వారా అక్కడి నుంచి రక్షణ సంస్థలు లబ్ది పొందుతున్నందున యుఎస్‌ఎ వంటి పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లో యుద్ధం ముగియాలని కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ప్రపంచంలో ఆహార సంక్షోభానికి రష్యా ఉక్రెయిన్‌తో చేసిన యుద్ధం కారణమని చెప్పలేమని, ప్రపంచ మార్కెట్‌లో గోధుమల వాటా కేవలం ఒక శాతం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో పాలనను ఏర్పాటు చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి యుఎస్‌ఎ బిలియన్ల పెట్టుబడులు పెట్టిందని, రష్యా ఎప్పుడూ అలాంటి వాటిని విశ్వసించలేదని మరియు వాటిని ఎవరు పరిపాలించాలో నిర్ణయించే విషయాన్ని ప్రజలకే వదిలేశారని బాబూష్కిన్ తెలిపారు.